అప్పుడు పీవీనరసింహారావుగారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్యామంత్రిగా వున్న రోజులు. వారికి సాహిత్యం పట్ల ఎంత మక్కువంటే సామాన్యులైన పండితులు రచయితలను కూడా ఆదరించే గొప్పస్వభావం. మా నాన్నగారు కాకినాడ పిఠాపురంరాజావారి కళాశాలలో ఇంగ్లీషు లెక్చరరుగా వున్నారు. వారు రచయిత, కవి, సంస్కృత పండితులుగా ఎన్నో పురాణ ఆధ్యాత్మిక గ్రంథాలను వ్రాసేవారు. సంస్కృతంలో వున్న భారత భాగవత రామాయణ గ్రంథాలను అందరూ చదువుకునేలా రాసేరు. ఆ మూడు గ్రంథాలనూ ఆవిష్కరించే కార్యక్రమం తలపెట్టారు. ఆ ముగ్గురూ ఎవరు అయితే బాగుంటుంది అని ఆలోచన చేశారు. మొదట పీవీగారే మెదిలారు. అయితే వారు వస్తారా…. అయినా ప్రయత్నం చేద్దామని అభ్యర్థిస్తూ లేఖ రాసేరు.
అదే మరొకరైతే నాకు వీలుపడదు, ఊపిరిసల్పనంత పనితో వున్నాను….అనో… అసలా లేఖను పరిశీలన చేసేవారు కాదేమో… అక్కడ వున్నది ఎవరు? పీవీగారు కదా! వెంటనే అంగీకరిస్తూ జవాబు రాసేరు. నాన్నగారి ఆనందానికి అంతులేదు. సరే ఒక గ్రంథం పీవీగారు ఆవిష్కరిస్తారు. మిగతా రెండూ? అప్పటికే ఉద్దండ పండితులూ ప్రఖ్యాత కవి రచయితలు అయిన విశ్వనాథ సత్యనారాయణ, దివాకర్ల వెంకటావధానిగార్లు ఆప్త మిత్రులు నాన్నగారికి. కళలకు పెట్టింది పేరు కాకినాడ. తరచుగా సాహితీ కార్యక్రమాలు సదస్సులూ జరిగినపుడు వారిద్దరూ మా ఇంటికి వచ్చి ఉండేవారు. వారు బయట ఎవరింటిలోనూ భోజనం చేయరు. అమ్మ మడిగా శుచిగా రుచిగా పిండివంటలతో వంటచేసేది. కనుక మాకు బాగా ఆప్తులు. వారు వుండనే వున్నారు. వారికీ చెప్పగానే మిగిలిన పనులు మానుకుని ”పీవీగారే వస్తున్నప్పుడు మేము రాకపోడం జరగనే జరగదు” అన్నారు.
అంతటి సాహితీమూర్తులు వేదికను అలంకరిస్తే ఆ మహోత్సవం ఎలా వుంటుంది? ఎందరో నాన్నగారి దగ్గిర చదువుకున్న డాక్టర్లు, ఇంజినీర్లు, ప్రొఫెసర్లు గ్రామాల జమీందార్లు సినీప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందాయి. వేదిక ఎక్కడ వుండాలి….. నగరానికి ముఖ్యమైన బజారు సినీథియేటర్లూ వున్న వీధిలో వేయి మంది జనం పట్టే సూర్య కళామందిర్ ముస్తాబైంది. కాకినాడ ప్రత్యేకతే అది. సినిమా థియేటర్లు అన్నీ అప్పట్లో ఒకే వీధిలో పన్నెండుదాకా ఉండేవి. చుట్టుపక్కల గ్రామాలవారికీ ఈవార్త తెలిసిపోయింది. అసలే సినిమా మాట్నీ వదిలిన టైము, ఆ జనం ఈ జనం వచ్చేసి చోటులేక అక్కడి రోడ్డుమీద అటూఇటూ నిలబడ్డారు. పోలీసులు “మీకేం కనబడుతుంది… ఇంటికి పొండి” అంటే ”మైకులు పెడతారు కదండీ… ఆ మైకులో వారి ముగ్గురి ప్రసంగాలూ వింటాము, మేము వెళ్ళం.” అన్నారు. ఆనాటి కవుల వైభవం అంతటిది. అయితే అన్నిఅంశాలలో గొప్పవారైన పీవీగారిని చూడాలన్న ఆత్రం అది. ఇక పీవీగారు ఆవిష్కరించే గ్రంథం చదివే తీరికలేని వారు హైదరాబాదు నుంచి కాకినాడ కారులో వస్తూ శ్రద్ధగా మొత్తం చదివారు. ఇక్కడ మీరు గమనించండి… రాజకీయ నాయకులు ఎలా వుంటారు? అసలా పుస్తకం వైపు కన్నెత్తి చూస్తారా? ఏదో ఒక పేజీ చదివేసి రాసిచ్చే సెక్రటరీలు వుంటారు. మొక్కుబడిగా నాలుగు మాటలు చెప్పేసే వారిని చూసేం. వీరు అలాంటివారు కానే కాదు.
అందుకే ఈ విషయం స్వయంగా చెప్పి పుస్తకం గురించి మాటాడిన అపర నర్సింహుడీతడు. ఎందరో రచనలు చేస్తారు. పేరున్న రచయితల చేత ఆవిష్కరింప చేయాలనీ ఆశిస్తారు. అదంతా సులువుగా జరగకపోవచ్చు. కానీ పీవీగారు మామూలు వ్యక్తికాదు. ఔపోసన పట్టే మేధావి. చిన్న-పెద్ద అనే తేడా లేదు. వారికి నచ్చాలి అంతే! గ్రంథ రచయితగా నాన్నగారూ సంతానమైన మేమూ చేసుకున్న అదృష్టం. కాకినాడ నగర చరిత్రలోనే చెప్పుకోతగిన ఈ సాహిత్య సభకు పీవీగారు రావడం, అది అంగరంగ వైభవంగా జరగడం మాకు ఎప్పటికీ మరువలేని అనుభూతి.
ఒకప్పుడు విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలి ఆస్థానంలో ‘భువనవిజయం’ గురించి చరిత్రలో చదివాము. ‘అది ఇలాగే జరిగి వుండాలి’ అంటూ అప్పటి పత్రికలూ వ్రాసేయి. రేడియోలో వార్తలు వినిపించారు. ఒక్క సాహిత్యమే కాదు రాజకీయంగా, వ్యక్తిపరంగా పీవీగారి జీవితం ఎంతో ఉత్తమమైంది. వారి ఆలోచనలు స్ఫూర్తిదాయకం. వారు రాసిన పుస్తకాలూ ఎందరికో మార్గదర్శకాలు. వారి ప్రభావం చాలామందిపై ఉంటుంది.
అందరికీ చిరస్మరణీయులు. కాలంతోపాటు మారుతూ ప్రజల అభిమానం చూరగొనడం ఉత్తమ నాయకుల లక్షణం. అది నిరూపించిన పాములపర్తి వెంకట నరసింహరావుగారు ధన్యులు.
వాణిగారు నాన్నగారిని దర్శించుకోవడం వారి ఆశీస్సులు తీసుకోవడం మాకెంతో అదృష్టం. వారిని తలుచుకుని ఈ వ్యాసం రాసేను.
ఏ. అన్నపూర్ణగారిది కాకినాడ. వారి నాన్నగారు పిఠాపురం రాజావారి కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్గా పని చేశారు. ఇంట్లో చాలా అమూల్య గ్రంథాలూ నవలలు, మాసపత్రికలు, ఎన్నో పుస్తకాలు ఉండడం వలన చిన్నప్పటి నుంచే బాగా చదవడం అలవాటైంది. బాల సాహిత్యంతో పాటు ఇతర పుస్తకాలు చదివేవారు. ఆ తరువాత చదువు, పెళ్లి పిల్లలు జీవితంలో అందరిలాగే పరిణామాలు జరిగినా ఏనాడూ చదవడం మానలేదు. పిల్లలు బాగా చదువుకుని మెరిట్లో అమెరికా వెళ్ళాక తీరిక లభించి రచనలు చేయాలనే ఆలోచన వచ్చింది. రంగనాయకమ్మ, వై.సులోచన రాణి, యండమూరి, మల్లాది అభిమాన రచయితలు. వారి ప్రభావమో ఉత్తరాలు రాసే అలవాటూ కలసి వారిని రచయిత్రిని చేశాయి. వారి మొదటి కథ ‘రచన మాసపత్రిక’లో వచ్చింది. మొదటి నవల ‘చతుర’లో ప్రచురితమయింది. వీరి రచనలను ఎక్కువగా – రచన, చతుర ప్రచురించాయి. ఏభై కథలు. మూడు చతుర నవలలు, ఇరవై అయిదు కవితలు వ్రాశారు. విపుల కథలు రెండు కన్నడంలో అనువదించారు. ఇంకా ఇతర పత్రికలు, వెబ్ మ్యాగజైన్లలోను ప్రచురితమయ్యాయి. మాజీ ఐఏఎస్ ఆపీసర్ డాక్టర్.జయప్రకాశ్ నారాయణగారు తొంభై ఏడులో హైదరాబాదులో స్థాపించిన ‘ఉద్యమ సంస్థ’లో ఇరవై నాలుగేళ్లుగా కార్యకర్తగాను; సంస్థ మాసపత్రికలో వ్యాసాలు రాసే రచయిత్రిగా గుర్తిపు రావడం వారికి సంతృప్తినిచ్చింది! అటువంటి అత్యుత్తమైన గొప్ప అధికారితో పనిచేసే అవకాశం రావడం అన్నపూర్ణ గౌరవప్రదంగా భావిస్తారు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి భార్య ఇందిర అన్నపూర్ణగారికి మేనత్తగారే! ఇప్పుడు గత ఆరు సంవత్సరాలుగా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. చదవడం రాయడంతో కాలం ఆనందంగా గడిచిపోతోంది. వారి భర్త మేథ్స్ ప్రొఫెసర్గా హైదరాబాదులో పనిచేశారు.
ఓ మంచి జ్ఞాపకం . యాభై ఏళ్ల తరువాత కూడా గుర్తుంచుకొని రాశారు. శ్రీమతి అన్నపూర్ణ నిత్య సాహితీ సాధకులు.
Dhanyavadalu valliswargaru….indanta me prostahame.!
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™