వ్యాసమహర్షి రచించిన శ్రీదేవీభాగవతములో సనాతన వేదధర్మంలో గల దేవతా వ్యవస్థను గురించిన వివరణ మణిద్వీపవర్ణనలో ఉంది. అది తెలుసుకునే ముందు పరమాత్మ నుండి జీవులతో కూడిన ప్రపంచం వ్యక్తమవ్వాలంటే ఎన్ని రకాల సృష్టులు అవసరమో ఒకసారి సింహావలోకనం చేసుకుందాం.
ఈ ప్రపంచ నిర్మాణానికి కారణమైన సృష్టులనే సర్గలు అని గూడా అంటారు. అవి:
చీలిన గిట్టలు గలవి: వృషభాలు, గోవులు, దున్నలు, మేకలు, ఒంటెలు, పందులు మొదలగునవి.
చీలని గిట్టలు గలవి: గుర్రాలు, గాడిదలు, శరభాలు, చమరీమృగాలు మొదలైనవి.
ఐదేసి గోళ్ళు కలవి: కుక్క, నక్క, తోడేలు, పులి, సింహం, కోతి, ఏనుగు, కుందేలు మొదలైనవి.
జలచరాలు: మొసలి, తిమింగలాలు మొదలైనవి.
పక్షులు: గ్రద్ద, డేగ, నెమలి, హంస, చక్రవాకం, కాకి, గుడ్లగూబ మొదలగునవి. ఇవి తమోగుణం ఎక్కువగా గలవి. రేపటి సంగతి ఎరగనివి. ఆహారాది జ్జానం మాత్రం గలవి. ముక్కు చేతనే పసిగట్టేవి.
ఈశ్వరుని వల్ల అనుగ్రహింపబడి బ్రహ్మదేవుడు దక్ష్మమరీచాది ప్రజాపతులను సృష్టించడాన్ని సర్గము అంటారు. ఈ ప్రజాపతుల ద్వారా చరాచర ప్రాణికోటి సృష్టింపబడటాన్ని విసర్గము అంటారు. విసర్గము ప్రజాపతుల సృష్టన్నమాట. వీరి ద్వారా అనేక జీవజాతులుద్భవించాయి. ఈ జీవజాతులను 4 రకాలుగా విభజించారు: 1. ఉద్భిజాలు: భూమి నుండి పుట్టిన లతలూ, వృక్షాలు…! 2. స్వేదజాలు: తేమ, చెమట నుండి పుట్టిన పేలు, నల్లులు మొదలైనవి. 3. అండజాలు: గుడ్డు నుండి పుట్టిన పక్షులు మొదలైనవి. 4. జరాయుజాలు: జరాయువు (మావి)తో తల్లి గర్భం నుండి పుట్టిన మనుష్యులు…!
మొత్తానికి జీవరాసులన్నీకలిపి 84 లక్షలుగా లెక్కతేల్చారు. ఇంకా ఎక్కువే ఉండచ్చు. చీమ నుంచి బ్రహ్మ వరకూ గల జీవుల్లో దేవతలు శ్రేష్ఠులు, ఉన్నతులు. మానవులు పృథ్వీతత్వం ప్రధానంగా గలవారు. దేవతలు తేజోతత్వం ప్రధానంగా గలవారు. వారు ఎంతో మహిమాన్వితులు. ఒకేసారి రెండు స్థాయిల్లో పనిచేస్తుంటారు: 1. మానవస్థాయి, 2. దేవతా స్థాయి. దేవాధీశ్వరులైన త్రిమూర్తులు ఒకే సమయంలో 3 స్థాయిల్లో పనిచేస్తుంటారు: 1. మానవ స్థాయి, 2. దేవతాస్థాయి, 3. బ్రహ్మాండస్థాయి. బ్రహ్మాండస్థాయిలో త్రిమూర్తులు ఎలా పనిచేస్తారన్నది తెలుసుకోడానికి మనం శ్రీమహాభాగవతము లోని వామనావతార ఘట్టంలోని అంశాలను పరిశీలించాలిప్పుడు.
ఒకానొకప్పుడు దేవలోకంలోనున్న జీవులకు ఉండాల్సినంత పవిత్రత ఉండేది కాదు. అందువల్లే వారు తరచుగా ఓడిపోయేవారు. ఆ సమయంలో బలిచక్రవర్తి స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు. ఇది సరిదిద్దాలంటే బలిని దండించాలి. ఇంకా దేవతలను పవిత్రీకరంపజేసే ఒక విశేషశక్తిని ప్రవేశపెట్టాలి. అలా జరగాలంటే బ్రహ్మాండ కటాహానికి తగినంత చిల్లి పెట్టి, దాన్లో నుంచి కొంత పవిత్రీకరణ శక్తిని స్వర్గలోకంలో ప్రవహించేట్లు చేయాలి. ఈ పని చేసేందుకే విష్ణుమూర్తి వామనుడిగా అవతరించి తన విరాడ్రూపాన్ని చూపించాడు. తన పాదాన్ని పెంచి బ్రహ్మాండానికి చిల్లిపెట్టాడు. ఆ సమయాన్ని బ్రహ్మ ఉపయోగించుకున్నాడు. వామనుడి కాలిగోటి వల్ల కటాహంలో చిల్లి ఏర్పడితే అందులోంచి బయటున్న శక్తి అంతా లోపలికి ఒరవడిగా తోసుకువస్తే అది అక్కడున్నజీవులకు క్షేమం కాదనుకుని బ్రహ్మదేవుడు సూక్ష్మరూపంలో కటాహం యొక్క బయటి వైపుకు వెళ్ళి అక్కడున్న అనంతశక్తిలో కొంతభాగాన్ని సూక్ష్మజలరూపంగా మార్చి తన కమండలంలోకి ఆకర్షించుకున్నాడు. వామనుడి కాలివేలు ఆ కటాహాన్ని ఛేదిస్తూ బయటకు వచ్చింది. వెంటనే బ్రహ్మ తన కమండలంలోని సూక్ష్మజలాన్ని విష్ణుపాదాలమీద కొద్దికొద్దిగా పోస్తూ ఆ పవిత్రజలాన్ని స్వర్గంలో ప్రవేశపెట్టాడు. విష్ణుపాదానికి బ్రహ్మజలంతో అభిషేకంచేయడంవల్ల ఆ జలానికి విష్ణుశక్తి, బ్రహ్మశక్తి గూడా సోకి దాని పవిత్రత ఇనుమడించింది. అదే దివ్యగంగగా పేరొందింది. దానివల్లే దేవతలకు విశేషశక్తులు లభించి బలవంతులయ్యారు. అనంతరం భగీరధుని తపస్సు వల్ల స్వర్గం నుండి భువికి దిగింది గంగ. ఈ సందర్భంలో శివుడు ఆ గంగను తన జటాజూటంలో బంధించాడు. దానివల్ల శివుని దివ్యశక్తి గూడా గంగకుసోకి స్వర్గంలో కన్నా ఎక్కువ పవిత్రత సంతరించుకుంది. దీనివల్ల బ్రహ్మాండం యొక్క పటిష్ఠత ఎంతటిదో తెలియడమే కాకుండా, బ్రహ్మాండానికావల చైతన్యశక్తి ఆవరించి ఉంటుందని గూడా తెలుస్తోంది.
ప్రాచీన భారతంలో ఎందరో ఋషులు తపశ్చర్యల్లోనే కాలం గడిపేవారు. తాము తపస్సమాధిలో దర్శించిన సత్యాలను ఉపనిషత్తుల రూపంలో శిష్యుల ద్వారా భావితరాలకు అందించారు. అవన్నీ మనకు తేలిగ్గా అర్థమవడానికి వేదవ్యాసులవారు పురాణాలు గాను, ఇతిహాసాలుగాను అందించారు. ఆధునికులెవరూ కలలో గూడా ఊహించలేని ప్రపంచ సృష్టి, బ్రహ్మాండ సృష్టి, ఆ బ్రహ్మాండానికి సంబంధించిన సూక్ష్మలోకాల్లాంటి అద్భుత విషయాలను గూర్చి ఈ పురాణేతిహాసాలు తెలుపుతాయి. ఇటువంటి గొప్ప సంస్కృతి ఒక్క భారతీయులకే చెందినందుకు మనం ఎంతగానో సంతోషించాలి. మన ఈ పురాణాలను మనం గౌరవించగల్గితే ఎంతో ధన్యులం. నిజానికి వాటిని గౌరవించడం మన ధర్మంగా భావించాలి. అసలు మనకంటికి కనిపించని దివ్యలోకాలను ఎంతో అద్భుతంగా ఎలా వర్ణించారో తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది.
శ్రీదేవీభాగవతములో గల మణిద్వీపవర్ణన – అందులోగల దేవతా వ్యవస్థను గూర్చి తెలుసుకుంటుంటే వ్యాసమహర్షి నిజంగా వ్యాసభగవానుడే అనిపిస్తుంది. ఎంతోమంది దేవతల ప్రస్తావన ఉంటుంది అందులో.
చాలామందికి అర్థం కాని విషయం హిందువులకింతమంది దేవతలెందుకున్నారని. ఎవరైనా తెలుసుకోవలసిందేంటంటే సనాతన వేద ధర్మంలో ఓ దేవతావ్యవస్థ ఉంది. అది సృష్టి ఆరంభం నుండే ఉంది. అసలు దేవతలతోనే సృష్టి ఆరంభమైంది. వారే ముందు పుట్టారు. వారంతా ఈ భ్రహ్మాండం లోపలనున్న లోకాల్లో ఉన్నారు. వారికి చావు పుట్టుకలు మనలాగ లేవు. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు వారిని సృజించాడు. ఆ బ్రహ్మతోనే కల్పాంతం వరకు వారు ఉంటారు. ప్రళయంలో బ్రహ్మతో పాటు పరమేశ్వరునిలో లయించిపోతారు. కొందరు దేవతలు మనువులతో పాటు వస్తారు, మనుప్రళయంలో లయించిపోతారు. ఇలా ప్రతీ మన్వంతరంలో వారే వస్తారు లేక వారి సంతతివారైనా వస్తారు, పోతారు.
బ్రహ్మకల్పం అంటే బ్రహ్మకు ఒకరోజు (1 పగలు + 1 రాత్రి). పగటిపూట బ్రహ్మ సృష్టి చేస్తాడు. రాత్రిపూట ఆ సృష్టి ప్రళయంలో లయించి పోతుంది. ప్రతీ కల్పంలోను 14 మంది మనువులు పాలన చేస్తారు. ప్రతీమనువుకు ఒక అధికార వ్యవస్థ ఉంటుంది. ఆయన పాలనలో ఆయనకు సాయంగా ఉండేవారు: ఇంద్రుడు, దేవగణాలు, సప్తఋషులు మొదలగువారు. ఇవి అధికార స్థానాలు. ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఈ అధికారస్థానాలు పొందలేరు.
ఇప్పటికి సృష్టి జరిగి 195 కోట్ల సంవత్సరాల పైనే. అంటే దేవతలకి కూడా ఇంచుమించు ఇంత వయసుండచ్చు. మన్వంతర కాలాన్ని లెక్కలోకి తీసుకుంటే మనువులకున్నంత వయసుంటుంది. ఈ బ్రహ్మాండంలో ఎన్నో లోకాలున్నాయి. అవి మన భౌతిక కళ్ళకు కనపడవు. దేవతలంతా సూక్షప్రపంచానికి చెందినవాళ్ళు. మనం ఉంటున్న ఈ స్థూల ప్రపంచానికి చెందినవారుకారు.
కొన్ని లోకాలగురించి పురణాలలో వివరాలుంటాయి: బ్రహ్మలోకం, విష్ణులోకం, కైలాసం, ఇంద్రలోకం మొదలగునవి. బ్రహ్మలోకమంటే బ్రహ్మగారు ఒక్కరే ఆయనలోకంలో ఉండరు. ఆయన కింద ఓ అధికార వ్యవస్థ ఉందని చెప్పుకున్నాం. ఆయనకు సృష్టి రచనలో సాయంగా మనువులు, దేవతలూ, ఋషులు, యుగపురుషులు (కృత,త్రేతా, ద్వాపర,కలి) ఉంటారు. ఇంతమంది ప్రపంచ సృష్టిలో పాలుపంచుకుంటున్నారన్నమాట.
సృష్టి ఆరంభంనుంచి చాలా మహత్తరకార్యాలు సాధించినవారిని మనం దేవుళ్ళుగా భావించి పూజిస్తాం. సృష్టి ఆరంభంలో బ్రహ్మగారికి భూమి కనపడకపోతే సర్వ వ్యాపకుడైన విష్ణుయొక్క అవతారమైన ఆదివరాహస్వామి నీటిలో మునిగి భూమిని ఉద్ధరించి పైకి తీసుకువచ్చిబ్రహ్మకు సృష్టి విషయంలో సాయం చేసాడు. అందుకే ఆయన్నివిష్ణువుయొక్క అవతారంగా పూజిస్తాం. అలాగే శ్రీరాముడు 24వ మహా యుగంలో (వైవస్వత మన్వంతరంలో) చివర పుట్టి రావణాది రాక్షసులను వధించి ముల్లోకాలకూ వాళ్ల పీడనుంచి విముక్తి కలుగ చేసాడుకాబట్టి శ్రీరాముడి పూజిస్తాం. అలాగే 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు పుట్టి అధర్మపరులై మానవ రూపంలో ఉన్న అసురులను సంహరించి భూభారం తగ్గించాడు కాబట్టి శ్రీకృష్ణుడిని పూజిస్తాం. ఇలా మనకు వేలకొలదీ దేవుళ్ళు ఉన్నారు. వారికి పరివారాలున్నాయి. వారందరికీ తగిన లోకాలున్నాయి. ఇది ఇంకా తేలిగ్గా అర్ధం కావాలంటే మనం శుభకార్యాలప్పుడు శ్రీసత్యనారాయణవ్రతం చేస్తుంటాం అందులో ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
సత్యనారాయణస్వామి వ్రతంలో ఈ క్రింది విధంగా పూజ చేస్తాం:
ఇవన్నీ అయ్యాక సత్యనారాయణస్వామిని పూజిస్తాం. అంటే దేవతలను పరివార సహితంగా పూజిస్తాం. ఇంత దేవతా వ్యవస్థ మనకుందని పండితులకు మాత్రమే తెలుసు. ఇంకెవరికీ తెలీదు. ఇలాంటి దేవతా వ్యవస్థను గూర్చి వ్యాసులవారు శ్రీదేవిభాగవతంలో “మణిద్వీపం” వర్ణనలోతెలిపారు.
అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి ఆదిపరాశక్తి. ఆవిడనే పరదేవత, శ్రీదేవి, మహాదేవి, దేవి, భునేశ్వరి, లలితాంబిక… ఇలా వేల పేర్లతో పిలుస్తారు. శ్రీదేవి నివాస స్థానమైన మణిద్వీపం, మన బ్రహ్మాండంలో గల 14 లోకాలకు పైన ఉంది. ఈ మణిద్వీపాన్నే సర్వలోకమని అంటారు. ఇది సుధాసముద్ర మధ్యభాగాన ఉంది. ఇది ఎన్నో ప్రాకారాలతో నిర్మించబడి ఉంది. మొత్తానికి 18 ప్రాకారాలున్నాయి. వీటిమధ్య గల చింతామణి గృహంలో ఆ జగజ్జనని మహాదేవి, మహాదేవునితో కలిసి ఉంటుంది.
చింతామణి గృహమంటే కోరిన కోర్కెలు తీర్చే మణులతో జేసిన భవనం. ఇక్కడ గల ప్రదేశాలు, మందిరాలు, వేయిస్తంభ మండపాలు, గోపురాలు, ద్వారాలు అన్నీ సూర్యకాంతి మణులతో, చంద్రశిలలతో చేసినవి. అందువల్ల అన్నీ ప్రకాశమానంగా ఉంటాయి. ఇందులో మధ్య భాగాన శ్రీదేవి సదనముంది. అందులో వేయి స్తంభాలు గల నాలుగు మండపాలున్నాయి. అవి శృంగార, ముక్తి, జ్ఞాన, ఏకాంత మండపాలు. అన్నీ కోటిసూర్య ప్రకాశమానంగా వెలుగుతుంటాయి. ఆ ప్రాంతాలన్నిటినీ అనేక రకాల పూలవనాలు సుగంధభరితం చేస్తాయి. ఆ మధ్యలో సుగంధభరితమైన మహాపద్మవనముంది. చుట్టూ వాపి కూప తటాకాలున్నాయి. తుమ్మెదల ఝంకారంతో ఆ ప్రాంతమంతా సంగీత భరితమై ఉంటుంది. శృంగార మండపంలో దేవాంగనలు దివ్యగానం చేస్తారు. సభాసదులంతా దివ్యనారీమణులే. మండపం మధ్యలో దేవి సుఖాసీనయై ఉంటుంది. ముక్తి మండపంలో దేవి అందరికీ ముక్తినిస్తుంది. జ్ఞాన మండపంలో జ్ఞాన బోధ చేస్తుంది. ఏకాంత మండపంలో మంత్రులతో జగద్రక్షణ కార్యం విచారిస్తుంది.
చింతామణి గృహంలో దేవి కూర్చునే పర్యంకానికి సోపానాలుగా 10 శక్తి తత్త్వాలున్నారు. ఆ పర్యంకానికి నాలుగు ఆధారాలుగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశానులున్నారు. దానికి మంచఫలకంగా సదాశివుడున్నాడు. దానిమీద మహాదేవి, మహా దేవుని వామాంకాన విరాజిల్లుతుంది. మహాదేవుడంటే మాయను తన ఆధీనంలో అయిన మహాదేవి నవరత్నాభరణాలు ధరించి వేల దాసీజనంతో సేవలందుకుంటూ ఉంటుంది. అక్కడున్నవారంతా యువతీయువకులే. సర్వదేవతలూ కొలుస్తుండగా ఆ మహాదేవి, మహాదేవుని పర్యంకాన విరాజిల్లుతూ అందరినీ అనుగ్రహిస్తూ ఉంటుంది. అక్కడంతా ఆనందమే ఆనందం. అదే బ్రహ్మానందం. ఆనందోబ్రహ్మ.
ఆనందం ఎన్నిరకాలుగానో ఉంటుందన్న విషయం గురించి తైత్తిరీయోపనుషత్తులో ఉంది:
మనుష్యానందం, మనుష్య-గంధర్వానందం అన్నవి ఇంద్రియ భోగాలవల్ల కలిగేవి. దేవగంధర్వానందం నుండి కర్మదేవతల ఆనందం వరకు ఉన్నవి వారు ప్రపంచానికి మేలు చేయడం వల్ల కలిగేవి. దేవతలానందం అన్నది శాంతంగా, సంతృప్తిగా ఉండేవారి ఆనందం. ఇంద్రుని ఆనందం అన్నది ఇతరులను ఆకర్షించి, తనలాంటి జీవితం గడపమని ఉత్సాహపరచేటట్టుగా ఉండేది. పైన చెప్పిన ఆనందాలన్నీ గూడా ఒక శ్రోత్రియుడు, ఙ్ఞాని, కామరహితుడు అయిన వానిలో కనిపిస్తాయి. ఏ కోరికలూ లేకుండా నిష్కామకర్మతో జీవిస్తూ గడిపేవాడికి కలిగేది ఆనందమే ఆనందం. అదే బ్రహ్మానందం- పరబ్రహ్మానందం.
ఈశ్వరశక్తిని స్త్రీ గా అనుకుంటే ఆవిడనే పరాశక్తి, పరమేశ్వరి, మహాదేవి అంటారు, పురుషుడిగా అనుకుంటే ఈశ్వరుడు, పరమేశ్వరుడు, మహాదేవుడు మొదలగు పేర్లుంటాయి. బ్రహ్మానందస్వరూపిణీ, అఖిలాండకోటి బ్రహ్మాండనాయకి, ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులన్నీ ఆ దేవే అయినప్పుడు ఆ దేవికి సృష్టి స్థితి, లయకార్యాల నిర్వహణలో 3 స్థాయిలుంటాయి:
పరమాత్మ యొక్క చైతన్యశక్తి వల్ల ఏర్పడిన బ్రహ్మాండం వల్ల దేశం, కాలం, వస్తువు ఏర్పడ్డాయని తెలుస్తోంది. ఇంతవరకు మనం బ్రహ్మాండంలో గల స్వర్గాదిసూక్ష్మ లోకాలు భూమి లాంటి స్టూలలోకాలు, వాటిలో నివసించే అనేక రకాలుగా గల జీవుల గురించిన విషయాలు కొంత తెలుసుకున్నాం. ఆ క్రమంలో మణిద్వీపంలో గల దేవతావ్యవస్థను గూర్చి గూడా తెలుసుకున్నాం.
ఇన్నిలోకాలున్నాయి, ఏ లోకానికైనా పోవచ్చనుకోవచ్చుమనం. కొంచం ఆలోచించండి! మనం మామూలు మనుష్యులం! ఇంకా చెప్పాలంటే భౌతిక ప్రపంచానికి చెందిన మట్టి మనుష్యులం! మరి సూక్ష్మ భూమికలకు చెందిన పై లోకాలకు పోగలమా?అది మనకు సాధ్యమా? ఏదో చిన్న చిన్న వ్రతాలు, పూజలు, దానధర్మాలు చేసి పై లోకాలకు పోగలమా? ఇలాంటి పూజలకు వ్రతాలకు దేవతలు కరిగిపోయి మన మీద దయ చూపలేరట-పెద్దలన్నారు. అయితే గియితే ఏ గంధర్వాది ఉపలోకాల్లోకో ప్రవేశముంటుందేమో చెప్పలేం! పై లోకాలకి పోవాలంటే ఎంతో సాధన చేయాలిట. గంధంచెక్కలాగ అరిగి పోవాలిట. స్వర్గం గూడా ఊరికే రాదుట. జ్యోతిష్ణోమాది యజ్ఞాలు తప్పకుండా చెయ్యాలిట. అవి చేయగలవాళ్ళు, చేయించగలవారు ఉన్నారా ఇప్పుడు? మరి ఏంచేయాలి? ఆ మణిద్వీపవాసిని పాదాలు పట్టుకోవడమే గతి! ఐతే ఇంక మన కథ కంచికి పోయినట్లేనా? కాదండీ! కాదు! ఇంకా మన కథ కంచికి పోలేదు! మనం లోకాలగురించి, వాటిలోని జీవుల గురించి తెలుసుకున్నాం. ఇంకా మనం నివస్తున్న భూమి గురించి, కాలగమనంలో ఏర్పడ్డ మార్పులు, వివిధ మన్వంతరాలను పాలించిన మనువులు, యుగాల్లోని తేడాలు, వేదకాలంలోని జీవనవిధానం, వేదవిజ్జానం, సత్కర్మాచరణ చేస్తూ ధర్మబద్ధంగా జీవించిన మహెూన్నత చరిత్రలు గలిగిన చక్రవర్తులు మొదలగు విషయాల గురించి తెలుసుకోవలసిందెంతో ఉంది ముందర. అందుకు పదండి పోదాం ముందుకు.
(ఇంకా ఉంది)
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™