మా షాపింగ్ అయి, ఆలయం చేరుకునేసరికి సాయంత్రం 4 గంటలు అయింది. ఆలయం పెద్దగానే వున్నది. పురాతనమైన ఆలయంగా చెప్పబడే ఈ ఆలయ చరిత్ర మా ఆటో డ్రైవరు కొంత, అక్కడున్నవారు కొంత చెప్పినదానిని బట్టి ఏమిటంటే…
800 సంవత్సరాల క్రితం అక్కడ ఒక రైతు పొలం దున్నుతుంటే నాగలికి వీరభద్రస్వామి విగ్రహం అడ్డుపడిందిట. దానిని జరుపుదామని ప్రయత్నిస్తే ఫలితం లేకపోయింది. దానిని అలాగే వుంచి ఇంటికెళ్ళి పడుకున్నాడుట. కలలో స్వామి కనబడి తాను వీరభద్రుడననీ, ఆయన పొలంలో కనబడ్డది తానేననీ… ఎద్దుల బండిలో ఆ విగ్రహాన్ని వ్యతిరేక దిశలో తీసుకెళ్ళమనీ, ఆ సమయంలో ఇరుసు విరిగి పడ్డ చోట తనని ప్రతిష్ఠించి పూజలు చేయమని చెప్పాడు. అలాగే చేశారుట. దీనికి సాక్ష్యం నాగలి తగలటంవల్ల, స్వామి విగ్రహం నొసలు, కుడి కనుబొమ దగ్గర రెండు గీతలుంటాయి.
ఉండబండ అని పేరు రావటానికి కారణం అంతకు ముందు బండమీద వుండి తిని వచ్చాడు. అందుకని ఆ పేరు అన్నారు. సరిగా అర్థం కాలేదు కదూ. నాకూను. ఈయనకు పేద భక్తులు ఎక్కువట. సహజంగా వీరభద్రస్వామి అంటే గంభీర రూపుడు. కానీ ఈయన శాంత స్వరూపుడు.
పూర్వం ఒక కోమటి, వక్కల వ్యాపారం చేసుకునేవాడు. ఆ సమయంలో ఎడమపక్క కోనేరు వుండేదిట. ఆ వ్యాపారి తన వ్యాపారంలో భాగంగా వారానికొకసారి ఆ ప్రాంతాలకి వచ్చి అక్కడ రావి చెట్టు కింద విశ్రాంతి తీసుకునేవాడు. అలా వచ్చినప్పుడు ఒకసారి ఈ విగ్రహం చూసి ఇది వరకు లేదే ఎలా వచ్చిందని వాకబు చేశాడట. సంగతి తెలుసుకుని, తన వ్యాపారం అభివృధ్ధి చెందితే లాభాలలో 20 శాతం ఇస్తానని మొక్కుకున్నాడుట. ఆయన వ్యాపారం అభివృధ్ధి చెందింది. మొక్కుకున్న విధంగానే ఆయన ఆ గుడిని చాలా అభివృధ్ధి చేశాడుట. 1971 నుంచీ ఎండౌమెంట్స్ వారి అధీనంలో వుంది.
ఆలయ మండపాలన్నీ 300 సంవత్సరాల క్రితం కట్టించినవి. భద్రకాళి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించి 15 సంవత్సరాలు అవుతోంది.
దర్శనమయ్యాక తిరుగు ప్రయాణం మొదలు పెట్టాము. మధ్యాహ్నం చూసిన ఆలయాలు తృప్తికరంగా అనిపించలేదు అని మాలో మేము అనుకుంటుంటే మా డ్రైవర్ బూదగవిలో ఒక పురాతనమైన సూర్యాలయం వుంది తీసుకెళ్ళనా అని అడిగాడు. మనవైపు సూర్య ఆలయాల గురించి అంత వినలేదు. అందుకే ఉత్సాహం చూపించాము. ఆటో బూదగవి దోవ తీసింది.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్గా వచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™