ఇక్కడ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వరాలయానికి మేము వెళ్ళేసరికి ఉదయం 11-55 అయింది. ఆలయం మూసి వుంది. ఆలయం ఆవరణ విశాలంగానే వుంది. ఆలయం ఎదురుగా మండపంలో చిన్న నంది, దాని పీఠంపై రెండు వైపుల శాసనం కనబడుతోంది. మిగతా రెండువైపులా కూడా వ్రాసి వుందిగానీ, అరిగిపోయింది.
ఈ ఆలయం కృష్ణానదికి ఈవలి ఒడ్డున వుంటే అవతల తీరంలో ఐలూరు అనే ఊళ్ళో ఇదే సమయంలో ఆవిర్భవించిన ఇంకో శివాలయం వుంది. ఈ రెండిటినీ కలిపి ఉభయ రామేశ్వరమంటారు. ఇక్కడ లింగం సైకత లింగంట. మేము చూడలేదుగా.
త్రేతా యుగంలో రావణాసురుణ్ణి వధించినందుకు బ్రహ్మహత్యా పాతకంనుంచి తప్పించుకోవటానికి శ్రీరామచంద్రుడు శివలింగాలను స్ధాపించాడని అనేక కథలు వినవస్తూంటాయి. ఈ కథల్లోనే హనుమంతుడు శివలింగాన్ని తేవటానికి వెళ్ళటం, ఆలస్యంగా రావటం, ముహూర్తం మించిపోకుండా శ్రీరామచంద్రుడు సైకత లింగాన్ని ప్రతిష్ఠించటం, తర్వాత చేరిన హనుమంతులవారికి కోపం రావటం ఇవ్వన్నీ కొన్ని చోట్ల స్ధల పురాణాలుగా చెబుతారు. ఇక్కడ కూడా అదే. ఇక్కడ ఇంకో విశేషమేమిటంటే ఆంజనేయస్వామి తాను తెచ్చిన లింగాన్ని ప్రతిష్ఠించలేదనే కోపంతో తన తోకతో అక్కడ ప్రతిష్ఠింపబడిన లింగాన్ని పెకిలించబోయాడుట. అది రాలేదు. అయితే దానికి గుర్తుగా శివలింగంపై నేటికీ తోక గుర్తు కనబడుతుందంటారు. అక్కడున్న శివలింగం రాకపోయేసరికి హనుమంతుడు దిగులు చెంది తాను తెచ్చిన శివలింగాన్ని విసిరి వేశాడుట. అది కృష్ణానదికి అవతల వున్న ఐలూరు ప్రాంతంలో పడింది. హనుమంతుని ఆగ్రహం తగ్గించటానికి శ్రీరామచంద్రుడా శివలింగాన్ని కూడా ప్రతిష్ఠించాడుట. ఒకే సందర్భంగా శ్రీరామచంద్రుడిచే ప్రతిష్ఠింపబడిన శివలింగాలు కనుక ఈ రెండూ కలిపి ఉభయ రామేశ్వరముగా కీర్తి చెందాయి.
చిలుమూరులో ఇంకొక విశేషం చెబుతారు. ఇక్కడి శివలింగం ప్రతిష్ఠించిన తర్వాత క్రమేణా పెరగటం గమనించిన సీతాదేవి తన గుప్పిటతో ఇసుకను తీసి లింగం పైన వుంచిందిట. అప్పుడు లింగం పెరగటం ఆగిపోయింది. శివలింగము మీద గుప్పెడంత బొడిపలాగా ఇప్పుడూ చూడవచ్చుట.
ఉభయ రామేశ్వరం రెండు శివాలయాల్లో శివరాత్రికి పెద్ద తిరణాల జరుగుతుంది. శివ పార్వతుల కళ్యాణం ఘనంగా జరుగుతుంది. పెద్ద ఎత్తున అన్న సమారాధన కూడా జరుగుతుంది. వేలాదిమంది భక్తులు వచ్చి కృష్ణానదిలో స్నానం చేసి స్వామిని దర్శించుకుని, వేడుకలలో పాల్గొని తృప్తి చెందుతారు.
ఆలయం చిన్నదే. మూసి వుంది. బయటనుంచే ఫోటోలు తీసుకుని బయల్దేరాము. ఒకే రోజు చాలా ఊళ్ళు, చాలా ఆలయాలు చూడటం వల్ల వచ్చే ఇబ్బందే ఇది. మధ్యాహ్న సమయంలో ఆలయాలు మూసి వుంటాయి, వేచి వుండటానికి మనకి సమయం వుండదు, మళ్ళీ రావటానికి దూరాభారం. కొన్ని నిట్టూర్పులు తప్పవు.
మధ్యాహ్నం 12-10కి అక్కడనుంచి తర్వాత మజిలీకి బయల్దేరాము.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్గా వచ్చింది.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
Like Us
All rights reserved - Sanchika™